గత ఏడాది కాలినడకన మెట్లెక్కుతూ తిరుపతి కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది సమంత. ఈ ఏడాది కూడా అదే పని చేసింది. తన భర్త నాగచైతన్యతో కలిసి చాలా రోజుల తరువాత నటించిన `మజిలీ` రిలీజ్ సమయంలో కాలినడకన ఏడుకొండలెక్కిన సామ్ ఈ సారి తన స్నేహితురాలు రమ్య సుబ్రహ్మణియన్తో కలిసి తిరుమల కొండపైకి 3500 మెట్లెక్కడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
`నవ్వుకుంటూ ప్రశాంతంగా కొడపైకి నడుచుకుంటూ వెళ్లి తిరుపతిలో స్వామివారిని దర్శించుకున్నాం. ఈ పాదయాత్రతో ఈ ఏడాదికి గొప్ప ముగింపును పలికి 2020కి శుభారంభాన్నిచ్చాం. లార్డ్ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకోవడంలో నా పార్ట్నర్ సమంత ఎప్పుడూ నాకు తోడుగా వుంటోంది` అని సమంత స్నేహితురాలు రమ్యసుబ్రహ్మణియన్ సోషల్ మీడియా ఇన్స్టా గ్రామ్ వేదికగా వెల్లడించింది. సమంత ఈ ఏడాది తెలుగులో మజిలి, ఓ బేబీ, తమిళంలో `సూపర్ డీలక్స్` వంటి డీసెంట్ హిట్లని సొంతం చేసుకుంది.
వచ్చే సంవత్సరం 96 రీమేక్తో పాటు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. ఈ రెండు కూడా సమంతకు మంచి విజయాల్ని అందిస్తాయన్న కాన్ఫిడెంట్తో వుంది. దిల్ రాజు నిర్మిస్తున్న 96 చిత్రీకరణ దశలో వుంది. వెబ్సిరీస్ కూడా ఈ మధ్యనే మొదలైంది. వెబ్ సిరీస్తో సమంత బాలీవుడ్కు వెళుతోంది. ఇదే కాకుండా `పింక్` తెలుగు రీమేక్ కోసం సమంతని చిత్ర బృందం సంప్రదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.