`ఫిదా` చిత్రంతో సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులతో పాటు దర్శకుల్ని, నిర్మాతల్నికూడా ఫిదా చేసింది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సొంతం చేసుకున్న సాయి పల్లవి ఆ తరువాత కూడా నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం `నీది నాదీ ఒకే కథ` ఫేమ్ వేణు ఊడుగుల రూపొందిస్తున్న `విరాటపర్వం` చిత్రంలో నటిస్తోంది. రానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.
ఈ సినిమా తరువాత ఆమెకు మరో ఆఫర్ లభించినట్టు తెలిసింది. నేచురల్ స్టార్ నాని హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని నాని పుట్టిన రోజు సందర్భంగా సోమవారం చిత్ర బృందం టీజర్ని రిలీజ్ చేసి చిత్ర టైటిల్తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించేసింది.
`శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ విభిన్నమైన కథతో కూపొందనున్న ఈ చిత్రంలో నానికి జోడీగా సాయి పల్లవిని సంప్రదించారట. కథ నచ్చడంతో సాయి పల్లవి నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని ఇప్పటికే డేట్ని ప్రకటించేశారు, అందుకు తగ్గట్టుగానే చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.