యావత్ సినీ లోకం గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్లో సినిమా తెరకెక్కడం , ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా నటించడం తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. తమ అభిమాన హీరోలు నటించిన సినిమాను ఫస్ట్ డే చూడాలనే అతృతి అభిమానుల్లో కలిగింది. కానీ ఆ నాలుగు కుటుంబాల్లో మాత్రం ఆర్ఆర్ఆర్ విషాదం నింపింది. ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోగా..మరో ముగ్గురు సినిమా చూసేందుకు వెళ్తూ ప్రమాదానికి గురై మరణించారు.
అనంతపురానికి చెందిన ఓబులేసు(30) అనే వ్యక్తి బెనిఫిట్ షో చూస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించేలోపు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ అభిమాన హీరో సినిమా దృశ్యాలను చిత్రీకరిస్తూ ఓబులేసు కుప్పకూలిపోయినట్లు అతడి స్నేహితులు చెప్పుకొచ్చారు. మరో ఘటన విషయానికి వస్తే..ఆర్ఆర్ఆర్ మూవీ బెనిఫిట్ షోకి వెళ్తున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా అర్ధరాత్రి బెనిఫిట్ షో టికెట్ల కోసం వి.కోటకు వెళ్లారు. ఈ సమయంలోనే ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.