`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం `రెడ్` కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం `తడమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
మాళవిశర్మ, నివేద పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. థియేటర్స్ మూసివేయడం, లాక్డౌన్ వంటి కారణాల వల్ల `రెడ్` రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 28తో లాక్డౌన్ ముగుస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర బృందం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ప్రమోషన్స్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా `నువ్వే నువ్వే..` అంటూ సాగే ఓ పాటకు సంబందించిన మేకింగ్ వీడియోని రిలీజ్ చేయబోతోంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తున్నారు. రామ్ ఒక పాత్రలో మాస్గానూ, మరో పాత్రలో క్లాస్ గానూ కనిపించబోతున్నాడు. ఈ సినిమా అన్నీ కుదిరితే జూన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది.