కరోనా మహమ్మారి ఇండియాను కూడా పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు చేయి దాటాకపోయినా ముందే కట్టడి చేయకపోతే ఆ తర్వాత జరిగే పరిస్థితులను ఊహించడం కూడా కష్టమే. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటించారు. అయితే లాక్ డౌన్ అంటే ఎంతో మంది ఉపాధి కోల్పోతారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి వైద్యం చేయించడం కూడా ప్రభుత్వానికి తలకు మించిన భారమే అవుతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మొత్తం కదిలివచ్చి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా ఉన్న విషయం తెల్సిందే. నితిన్ 20 లక్షలతో మొదలైన టాలీవుడ్ విరాళాల ప్రక్రియ పవన్ కళ్యాణ్ రెండు కోట్లు ప్రకటించడంతో ఊపందుకుంది. ఒకరి తర్వాత ఒకరుగా టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నుండి సాధారణ హీరోల వరకూ ఏదొక రూపంలో సాయం ప్రకటించారు.
మహేష్ బాబు, అల్లు అర్జున్ కోటి 25 లక్షలు, చిరంజీవి కోటి రూపాయలు, ప్రభాస్ 4 కోట్లు ఇలా అందరూ తలో చేయి వేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి వంటి దర్శకులు కూడా తమకు తోచినంత సాయం చేసారు. మరి దర్శక ధీరుడు రాజమౌళి ఈ విపత్కర పరిస్థితులలో అందించే సాయం ఏంటి? ఇప్పటిదాకా రాజమౌళి వైపు నుండి ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ రాలేదు అంటే ఏ సాయం చేయట్లేదా?
ఇదే విషయమై ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని మీ సాయం ఏమిటని అడగ్గా మేము డబ్బులు ఇవ్వాలనుకోవట్లేదని, కరోనా కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులకు ప్రొటెక్టీవ్ కిట్లను అందించనున్నట్లు తెలిపాడు. ఇవి చాలా ఖరీదైనవి, ఒక్కసారి ఉపయోగిస్తే మళ్ళీ వేసుకోకూడదని, అందుకే ఈ కష్ట సమయంలో నాణ్యమైన సూట్లను అందించనున్నట్లు తెలిపాడు. ఆర్ ఆర్ ఆర్ యూనిట్ తరుపు నుండే కాకుండా వ్యక్తిగతంగా కూడా రాజమౌళి ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాడట. జక్కన్న అందించే సాయం కూడా వెలకట్టలేనిదే.