స్టార్ డైరెక్టర్ రాజమౌళి హైదరాబాద్ నుంచి తన మకాంను మార్చినట్టు తెలిసింది. కరోనా ప్రబలుతుండటం, రాష్ట్ర ప్రభుత్వం షూటింగ్లకు అనుమతులిచ్చినా స్టార్స్ మాత్రం లొకేషన్లో అడుగుపెట్టడానికి ధైర్యం చేయకపోవడం వంటి కారణాలతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి సమీపంలోని ఎదులూరు గ్రామంలో రాజమౌళి కుటుంబ సభ్యులు ఫామ్ హౌజ్లు నిర్మించుకున్న విషయం తెలిసిందే.
`ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ పునః ప్రారంభించాలని రాజమౌళి టెస్ట్ షూట్కు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పటికే మొదలైన టీవీ సీరియల్స్లో నటిస్తున్న పలువురు కీలక నటులకు కరోనా పాజిటివ్ రావడంతో స్టార్ హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్ షూటింగ్ చేయడానికి అంగీకరించలేదట. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ వాయిదా వేస్తేనే మంచిదని రామ్చరణ్, ఎన్టీఆర్ చెప్పారట. దీంతో సిటీలో వుండటం కంటే ఫామ్ హౌజ్కి వెళ్లి వుండటమే ఉత్తమం అని భావించిన జక్కన్న ఫ్యామిలీతో సహా హైదరాబాద్ నుంచి మకాం మార్చి తన ఫామ్ హౌజ్ పయనమైనట్టు చెబుతున్నారు.
కొంత కాలం ఫామ్ హౌజ్లో కాలక్షేపం చేస్తూ మహేష్ తో చేయాలనుకుంటున్న మూవీ స్క్రిప్ట్ని పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. కరోనా ప్రభావం తగ్గి వాతావరణం కుదుట పడ్డాక షూటింగ్లకు అనువైన వాతావరణం ఏర్పడిందన్న నమ్మకం కుదిరాక మళ్లీ సిటీలో అడుగుపెట్టాలని రాజమౌళి నిర్ణయించుకుని ఫామ్ హౌజ్కు వెళ్లినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.