`సాహో` వంటి యాక్షన్ థ్రిల్లర్ తరువాత ప్రభాస్ ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన నటిస్తున్న 20వ చిత్రం. `జిల్` ఫేమ్ రాధాకృష్ణకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్పై అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా పాకుతూ దేశాలని వణికిస్తున్న వేళ ఈ చిత్ర బృందం కరోనా వైరస్ విళయతాండవం చేస్తున్న ఇటలీ వెళ్లింది.
అక్కడి నుంచి జార్జియా వెళ్లిన టీమ్ కీలక ఘట్టాలని ప్రతికూల వాతావరణంలోనూ షూట్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. పరిస్థితి ఇంత దారుణంగా వుంటే ప్రాణాల్ని పణంగా పెట్టి సినిమా షూటింగ్ అవసరమా? ప్రభాస్ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని చాలా మంది చాలా రకాలుగా ప్రభాస్ టీమ్పై విమర్శలు చేశారు. బుధవారం చిత్ర బృందం ఇండియాకు ప్రత్యేక విమానంలో పయనమైంది. అయితే వాతావరణం భయాణకంగా మారుతోంది కాబట్టి సినిమా షూటింగ్ని అర్థాంతరంగా ముగించుకుని చిత్ర బృందం ఇండియా బయలుదేరారని పుకార్లు మొదలయ్యాయి.
వీటిపై దర్శకుడు రాధాకృష్టకుమార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందరి సహకారంతో ముందు తీసుకున్న జాగ్రత్తల కారణంగా షూటింగ్ అనుకున్న దానికి ముందే పూర్తి చేశామని, షూటింగ్ని అర్థాంతరంగా పూర్తి చేయలేదని క్లారిటీ ఇచ్చారు. `జాన్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న రిలీజ్ చేయాలనుకుంటున్నారని, లేదు 16నే రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.