లాక్డౌన్ సమయంలో చాలా సినిమాలు వేర్వేరు ఓటీటీ ప్లాట్ఫామ్లలో రిలీజ్ అయ్యాయి. కొన్ని చిత్రాలు రిలీజ్ చేయాలా వద్దా అనే మీమాంసలో వుండిపోయాయి. థియేటర్స్ ఖచ్చితంగా రీఓపెన్ అవుతాయి. అప్పుడే మా చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తామని ఆ మాటపై నిలబడిన వారు కూడా వున్నారు. అలా `క్రాక్` సినిమా థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తామని. అదే మాటపై నిలబడ్డారు దర్శకుడు గోపీచంద్ మలినేని. అయితే `క్రాక్`ని ఓటీటీలో రిలీజ్ చేయాల్సిందేనని తనపై ఒత్తిడి చేశారని తాజాగా బాంబు పేల్చారాయన
మంగళవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన గోపీచంద్ మలినేని తాజా విషయాన్ని వెల్లడించి షాకిచ్చారు. మాస్ మమారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ `క్రాక్`. ఠాగూర్ మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. గోపీచంద్ మలినేనికి సాలీడ్ విజయాన్ని అందించింది.
ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో ముచ్చటించిన దర్శకుడు గోపీచంద్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. `క్రాక్`ని ఓటీటీలో రిలీజ్ చేయమని తీవ్ర ఒత్తిడి జరిగింది. అయితే సినిమాపై వున్న నమ్మకంతో తాను థియేటర్ రిలీజ్కే మొగ్గు చూపానని, ఇదే విషయాన్ని ట్వీట్ కూడా చేశానని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో హీరో రవితేజ తనని సపోర్ట్ చేశారని, అయితే ఏం జరుగుతుందో తెలియని తీవ్ర ఒత్తడికి మాత్రం తాను లోనయ్యానని, చివరికి తన నమ్మకమే నిజమై సినిమా థియేటర్లలో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించిందని చెప్పుకొచ్చారు.