కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న పేరిది. దీన్ని యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ ఇప్పటికే హాలీవుడ్లో `కాంటాజియన్` పేరుతో ఓ సినిమా వచ్చింది. అయితే దానికి భిన్నంగా తెలుగులో ఓ సినిమాని త్వరలో చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని కబలిస్తున్న వైరస్ కరోనా. దీని బారిన పడిన దేశాలన్నీ దాదాపు అత్యధిక సంక్షలో మరణాలతో కకావికలం అవుతున్నాయి.
ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికే ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. చైనాలో అత్యధిక శాతం మరణాలున్నా ప్రపంచానికి ఆ విషయాన్ని తెలియనీయకుండా అక్కడి మీడియా, అధ్యక్షుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు మొదలయ్యాయి. మన దేశంలొనూ కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది.
ఇదిలా వుంటే దీన్నే కథావస్తువుగా తీసుకుని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ సినిమాకు శ్రీకారం చుట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఓ భయంకరమైన వైరస్ ప్రబలితే ప్రజల జీవన విధానం ఎలా మారుతుంది. ఎలాంటి వాతావరణం చోటు చేసుకుంటుంది? వంటి కీలక అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నవంబర్లోనే ప్రశాంత్ వర్మ ప్రారంభించాడని. ఇప్పటికే యాభై శాతం చిత్రీకరణ పూర్తయిందని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.