స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం `అల వైకుంఠపురములో`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరేట్గా దిగుతున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ దాటి రికార్డు సృష్టించాయి. ఆడియో సూపర్ హిట్ కావడంతో చిత్ర బృందం మ్యూజిక్ కాన్సెర్ట్ని హైదరాబాద్ యూసఫ్గూడా పోలీస్ గ్రౌండ్స్లో అత్యంత భారీ స్థాయిలో సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంచనాలకు మించి భారీ స్థాయిలో హాజరయ్యారు. ఫ్యాన్స్ జోష్ చూసి హీరో అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యారు కూడా. అయితే ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, ఇచ్చిన సమయానికి మించి కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారని. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కార్యక్రమానికి 5 నుంచి 6 వేల మంది మాత్రమే హాజరవుతారని, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పోలీసులకు ఇచ్చిన లేఖలో నిర్వాహకులు తెలిపారట.
అయితే నిబంధనలకు మించి ఈ కార్యక్రమానికి 15 వేల మందికి పైగా హాజరయ్యారని, రాత్రి 10 గంటలకు ముగించాల్సిన కార్యక్రమాన్ని రాత్రి 11:30 గంటల వరకు కొనసాగించారని, దీని కారణంగా యూసఫ్గూడా ఏరియాలో భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయిందని జూబ్లీహిల్స్ ఎస్సై నవీన్రెడ్డి కేసు నమోదు చేయడం ప్రధాన్యతను సంతరించుకుంది.