తెలుగు, తమిళ భాషల్లో లవర్ బాయ్గా పేరుతెచ్చకున్న సిద్ధార్థ తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్నారు. తెలుగులోనూ తన దూకుడు స్వభావం కారణంగా మీడియాకు దూరమైన సిద్ధార్ధ్ ఆ తరువాత తెలుగు చిత్రాల్లో కనిపించకుండా పోయారు. అప్పుడప్పుడు మాత్రమే తెలుగులో తన అనువాద చిత్రాల ద్వారా వస్తున్న సిద్ధార్థ్ గతంలో చెన్నైలో వచ్చిన వరదలపై కూడా స్పందించి సంచలనం సృష్టించారు. చెన్నైలో వచ్చిన వరదల కారణంగా తన ఇల్లు కూడా మునిగిపోయిందని, తన పరిస్థితే ఇలా వుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు.
దీంతో తమిళ మీడియాలో సిద్ధార్థ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అధికార పార్టీ నాయకులు కూడా సిద్ధార్థపై కామెంట్లు చేయడంతో వాతావరణం వేడెక్కింది. గత కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా వుంటూ వస్తున్నఆయన దాదాపుగా తెలుగులో తన క్రేజ్ని కోల్పోయారు. ఇటీవల డబ్బింగ్ సినిమా `వదలడు` చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన సిద్ధార్ధ్ మరోసారి వార్తల్లో నిలిచారు.
పౌరసత్వ బిల్లు కారణంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖులు, మేధావులు నిరసన గళం వినిపిస్తున్నారు. తాజాగా చెన్నైలోని వళ్లువార్ కొట్టాంలో విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ నాయకులు, మహిళలు భారీ యెత్తున నిరసన ప్రదర్శన చేశారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నసిద్ధార్థ్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వళ్లువార్ కొట్టాయం పోలీసులు కేసు నమోదుచేయడం చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థ్తో పాటు 600 మంది విద్యార్థులు, ఎంపీ తిరుమా వళవన్, మాజీ ఎమ్మెల్యే జవహరుల్లాపై 144 సెక్షన్తో పాటు పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేయడం తమిళ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.