పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసాడు. ఎప్పటినుండో వార్తల్లో ఉంటూ వస్తోన్న పింక్ రీమేక్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. అసలైతే పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుండి షూటింగ్ కు హాజరవ్వాలి. ఈరోజు నుండి మొదలయ్యే షెడ్యూల్ లో చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న నివేదా థామస్, అంజలి, అనన్యలకు సంబంధించిన సీన్లు పూర్తి చేస్తారు. వచ్చే నెల నుండి ఈ ముగ్గురితో పవన్ కాంబినేషన్ సీన్లను షూట్ చేస్తారు. కానీ లాస్ట్ మినిట్ లో ప్లాన్ లో చేంజ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే ఈరోజు నుండి చిత్రానికి డేట్లు ఇచ్చాడు.
మాములుగా అయితే ఉదయం 10 గంటలకు షూటింగ్ మొదలవ్వాలి కానీ ఈరోజు ఉదయం 7 గంటలకే షూటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుండి మధ్యాహ్నం వరకూ షూటింగ్ లో పాల్గొనే పవన్ మధ్యాహ్నం నుండి రాజకీయాల్లో బిజీగా ఉండనున్నాడు. మధ్యాహ్నం 1 గంట వరకూ షూటింగ్ లో పాల్గొన్నాక విజయవాడలో పార్టీ సమావేశానికి హాజరయ్యాడు. ఇలా సినిమానూ, రాజకీయాన్నీ బ్యాలెన్స్ చేయబోతున్నాడు. ముందుగా పవన్ కాంబినేషన్ ఉన్న సీన్స్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో గెడ్డంతోనే పవన్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. పింక్ తమిళ రీమేక్ లో అజిత్ గెడ్డంతోనే కనిపించాడు. అలాగే కోర్ట్ రూమ్ సీన్స్ లో గెడ్డంతో ఉండే పవన్ తర్వాత గెడ్డం తీసేసి హీరోయిన్ తో సీన్స్ లో పాల్గొననున్నాడు. ఏదేమైనా తన పార్ట్ షూటింగ్ ను మార్చ్ చివరికల్లా పూర్తి చేయాలనీ నిర్మాత దిల్ రాజుకు చెప్పినట్లు తెలుస్తోంది.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 23న విడుదల కానుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మొత్తం 5 పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్ర టైటిల్ మరియు ఇతరత్రా విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.