అభిమానులు హీరోలకు బూస్ట్ లాంటివాళ్ళు. వాళ్ళ సినిమాలు విడుదలయ్యాక హల్చల్ చేసేది వాళ్ళే. మరి సదరు హీరోగారు రాజకీయాల్లోకి వచ్చాక, ఆ అభిమానులు ఆయనను రాజకీయాల్లో కూడా హీరోను చెయ్యాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారికేమైనా అయితే వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఆయనదే కదా. మరి జనసేన అధినతే పవన్ కల్యాణ్ ఓ అభిమాని విషయంలో ఎందుకు కినుకు వహిస్తున్నారని అభిమాని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అభిమానులు నిర్వహించిన బైక్ ర్యాలీలో గాయపడి కిడ్నీని కోల్పోయిన తన కుమారుడిని పవన్ కల్యాణ్ ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితుడి తండ్రి మొళ్ల వీరబాబు బాధ పడుతున్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం…
మొళ్ల వీరబాబుది పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట గ్రామం. గత నెల 9న దేవరపల్లిలో పవన్ అభిమానుల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో వీరబాబు కుమారుడు రాజ మనోహర్ పాల్గొనగా, మనోహర్ను బైక్ ఢీ కొట్టింది. కిందపడ్డ అతనిపై నుంచి మరో బైక్ వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన రాజ మనోహర్ను స్నేహితులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఓ కిడ్నీ పూర్తిగా దెబ్బతిందని కిడ్నీని తొలగించారు వైద్యులు.
ఈ ఆపరేషన్కు గాను రూ.5 లక్షలు ఖర్చు అయ్యాయని వీరబాబు తెలిపాడు. ఆ డబ్బు అప్పు చేశానని తెలిపాడు. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ తాజాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు తెలపడంతో వీరబాబుకు ఏం చెయ్యాలో తోచని పరిస్థితి ఏర్పడింది. తెచ్చిన డబ్బంతా అయిపోయింది. ఇంకా వైద్యానికి మందులు కావాలంటే ఎక్కడినుంచి తేవాలని అంటున్నాడు.
కాగా, తన కుమారుడి స్నేహితులు కొవ్వూరు సభలో పవన్కు మనోహర్ ప్రమాద ఫొటోలు చూపించారు. కానీ పవన్ ఇప్పుడెలా వుందని కూడా అడగలేదని చెప్పాడు వీరబాబు. గత పది రోజులుగా రాజమహేంద్రవరంలోని ఆసుత్రిలోనే ఉంటున్నాం.. నా బిడ్డను కాపాడుకోవడానికి దాతలు ఎవరైనా సహాయం చేస్తే వారికి రుణపడి ఉంటానని వేడుకుంటున్నాడు వీరబాబు.
దాతలు.. ‘మొల్ల వీరబాబు, పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడి, ఆంధ్రా బ్యాంక్ ఖాతా నంబర్ 078910100059571, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏఎన్డీబీ0000789’ ద్వారా సహాయం అందించవచ్చు.