నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన చిత్రం `జెర్సీ`. ఓ ఫెల్యూర్ క్రికెటర్ లైఫ్ స్టోరీ నేపథ్యంలో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించింది. నటుడిగా నానికి, దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరికి మంచి పేరును తెచ్చిపెట్టింది. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో ఇదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు.
షాహీద్కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అమన్ గిల్తో కలిసి దిల్ రాజు, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ముంబై బాంద్రాలో పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ చిత్ర దర్శకుడితో టాలీవుడ్ టాప్ హీరో టాచ్లో వున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ టాప్ హీరో మరెవరో కాదు పవర్స్టార్ పవన్కల్యాణ్. జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. తాజాగా ఆయనతో `పింక్` చిత్రాన్ని రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
పవన్ మేకోవర్ కారణంగా ఈ సినిమా ముందు అనుకున్న విధంగా జనవరి నుంచి కాకుండా ఫిబ్రవరి లేదా మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఇదిలా వుంటే స్టార్ హీరో పవన్కల్యాణ్ ఈ సినిమా తరువాత వెంటనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారట. దీని కోసం `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరిని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్కల్యాణ్ అతనితో రెగ్యులర్గా టచ్లో వుంటున్నారట. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించే అవకాశం వుందని కూడా ప్రచారం జరుగుతోంది.