సామాన్య ప్రజలకు ప్రస్తుతం ఉల్లిపాయ కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. మరి రేటు తక్కువ ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వాడుతూ సగం వాడి, సగం పారేస్తూ ఉల్లిపాయకి వ్యాల్యూ ఇవ్వని జనాలకు అప్పుడప్పుడు ఉల్లిపాయ ఇలా తన విలువ ఇలా తెలియజేస్తూ ఉంటుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర 80 రూపాయలు గా ఉంది. త్వరలో ఈ ధర 100 రూపాయలకు చేరే అవకాశముందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దీనికి కారణం ఉల్లిపాయల దిగుబడి అధికంగా ఉండే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో అధిక వర్షాలు వరదల కారణంగా ఈసారి ఉల్లిపాయల దిగుబడి బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో అందరూ కర్నూల్ లో సాగుబడి అయ్యే ఉల్లిపాయల మీద దృష్టి సారించడంతో నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా మనకు ఇక్కడ ఉల్లిపాయలకు డిమాండ్ పెరిగింది. నవంబర్ నెల మొదట్లో కిలో 14 రూపాయలుగా ఉన్న ఉల్లిపాయ ప్రస్తుతం 80 రూపాయలకు చేరింది. త్వరలో వంద రూపాయలు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రెండు నెలల క్రితం క్వింటాలు 910 రూపాయలు పలికిన ఉల్లిపాయలు ప్రస్తుతం క్వింటాలు 6450 రూపాయలకు చేరాయి. సందట్లో సడేమియా లాగా రెండో రకం ఉల్లిపాయలు ఇలా 50 రూపాయలుగా మార్కెట్లో చలామణి అవుతున్నాయి.
ఏది ఏమైనా జనాలు తిట్టుకోవడం మానలేదు. ఉల్లిపాయలు తినడం కూడా మానలేదు. అదేమంటే “ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని” సంబంధం లేని సామెతలు చెబుతూ ఉంటారు. ఎంతైనా ఉల్లిపాయ రేటు పెంచినందుకు ప్రభుత్వాలను ముందు వెనుక చూడకుండా, దింపేసిన నీచమైన చరిత్ర ఉన్న సమాజం కదా మనది.