నందమూరి అభిమానులు , మెగా అభిమానులతో పాటు యావత్ సినీ లవర్స్ ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మరో రెండు రోజుల్లో థియేటర్స్ లలో ప్రదర్శించబడుతుంది. ఈ తరుణంలో ఇరు అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేయడం మొదలుపెట్టారు. భారీ భారీ కటౌట్స్ , ప్లెక్సీ లు ఏర్పటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకునే పనిలో ఉన్నారు. అయితే కోదాడలో ఓ థియేటర్ వద్ద చరణ్ , ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ ఏకంగా ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లింది.
కోదాడలోని ఓ పముఖ థియేటర్ వద్ద ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో ఇరు అభిమానుల మధ్య పరస్పరం ఘర్షణ తలెత్తినట్టు సమాచారం. ఇక దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు ఏకంగా పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యాయత్యానికి ఒడిగట్టడం చూసి స్థానికులు, తోటి అభిమానులు అతడిని వారించి అడ్డుకున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టినట్టు సమాచారం.