డ్రగ్స్ వివాదం బాలీవుడ్లో చిలికి చిలికి పెను దుమారంగా మారుతోంది. సుశాంత్ మృతితో డ్రగ్స్ వివాదం బయటికి వచ్చిన విషయం తెలిసిందే. రియా అరెస్ట్ తరువాత ఎన్సీబీ అధికారులు ఈ దిశగా విచారణ చేపట్టారు. దీంతో డ్రగ్స్ బాలీవుడ్తో పాటు సాండల్వుడ్, టాలీవుడ్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణంలో భాగంగా రియాని విచారించిన పోలీసులకు భారీ స్థాయిలో సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నట్టు నిరూపణ అయిందని జాతీయ మీడియా కోడై కూస్తోంది.
ఇప్పటికే ఈ వివాదంలో సారా అలీఖాన్తో పాటు శ్రద్ధా కపూర్, రకుల్, దీపిక ల పేర్లు బయటికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల దీపిక మేనేజర్ కరిష్మాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసిందని అయితే ఆమె హాజరు కాలేదని వరుస కథనాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్లో భారీ చిత్రాలు నిర్మించిన మధు మంతెన పేరు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఆయనకు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో `రక్త చరిత్ర` చిత్రంతో పాటు `గజిని` హిందీలో రీమేక్ చేయడమే కాకుండా హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ చిత్రాల్ని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఎన్సీబీ సమన్లు జారీ చేశారన్న వార్త ఆసక్తికరంగా మారింది.