సోషల్ మీడియా ప్రభావం మొదలైన దగ్గరి నుంచి సెలబ్రిటీలు సామాన్యులకు మరింత దగ్గరయ్యారు. ప్రతి విషయాన్ని నేరుగా వెల్లడిస్తుండటంతో సోషల్ మీడియా వాడకం మరింత పెరిగింది. వరుస ఫొటోలతోనూ తమ అభిమానుల్ని ఆకట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు చాలా సందర్భాల్లో బెడిసికొడుతున్నాయి. హద్దులు దాటిన కొంత మంది సెలబ్రిటీలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొంతమందైతే వరుస పోస్ట్లతో టార్చర్ చేస్తున్నారు.
తాజాగా అలాంటి సంఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిఖిల్ నటించిన `ఎక్కడికిపోతావు చిన్నవాడా` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నందితాశ్వేత. ఈ సినిమాలో ఘోస్ట్ ఆవహించిన అమ్మాయిగా నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఆమెని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీగానే వుంది. అయితే అందులో వాంజి సెలియన్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అసభ్యకరమైన పోస్ట్లతో నందితను టార్చర్ పెడుతున్నాడట.
ఈ విషయం పోలీసులకు చెప్పాలని చాలా మంది ఆమెకు సలహా ఇచ్చినా అంత వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లడం తనకు ఇష్టం లేదని, ఇలాంటి వాళ్లకు ఫ్యామిలీ అంటూ వుండదా? అని నందిత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలుగులో నందిత ప్రస్తుతం `ఐపీసీ 376` చిత్రంలో నటిస్తోంది.