కరోనా వైరస్ నుంచి తెలుగు రాష్ట్రాలు ఇక బయటపడినట్టే అని అనుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వల్ల వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం కనిపిస్తుండటం, తెలంగాణలో 6 గురు మృత్యు వాత పడటంతో ప్రమాద ఘంటికలు మొదలయ్యాయి. దీంతో లాక్ డౌన్ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో అంతా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకుంటూ లాక్ డౌన్ కు సిద్ధమవుతున్నారు.
టీవీ ఛానల్లకు లాక్ డౌన్ కారణంగా సరైన ఫీడ్ లేకుండా పోయింది. పలు సీరియల్స్ షూటింగ్ ఆగిపోయింది. పలు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఫీడ్ లేకపోవడంతో ఆ స్థానంలో పాపులర్ అయినా పాత కార్యక్రమాలని తిరిగి ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగా మళ్లీ మరోసారి కింగ్ నాగార్జున తెలుగు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తున్నాడు.
నాగ్ హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ సీజన్ 3 ని మళ్లీ మంగళవారం నుంచి మా టీవిలో ప్రసారం చేయడం ప్రారంభించారు. ఇక నుంచి సోమవారం నుంచి శనివారం మధ్యహ్నం 3 గంటలకు ఈ రియాలిటీ షో ప్రసారం కాబోతోంది. అన్నట్టు నాగార్జున నటిస్తున్న కాప్ స్టోరీ `వైల్డ్ డాగ్` కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.