జగన్ సర్కర్..మొదటి నుండి పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కక్ష్య సాధింపు చర్య చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ గత చిత్రం వకీల్ సాబ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో..భీమ్లా నాయక్ విషయంలోనూ అలాగే చేసింది. బెనిఫిట్ షోస్ కు , అదనపు షోస్ కు అనుమతి ఇవ్వకపోవడం పోవడం, టికెట్ ధరలు పెంచకపోవడం వంటివి చేసింది. ప్రభుత్వ తీరు పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా..తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ వ్యవహారం ఫై ఘాటుగా స్పందించారు.
ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమతో పాటుగా..పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ పై ఏపీ సర్కారు కక్షగట్టిందని.. వకీల్ సాబ్ నుంచి భీమ్లా నాయక్ వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ ను పవన్ ను టార్గెట్ చేసిందనే విషయం అర్థమవుతుందని నాగబాబు అన్నారు. సినిమా టికెట్ ధరల పై ప్రభుత్వం ఇప్పటికీ జీవో విడుదల చేయడం లేదని.. జీవో విడుదల చేయడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని మెగా బ్రదర్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ పై పగతో ఇలా చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం బాధాకరమని నాగబాబు పేర్కొన్నారు. సినిమా పెద్దలు పవన్ కు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇది తప్పు అని చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదని.. అగ్ర హీరోల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని నాగబాబు ప్రశ్నించారు. హీరో, నిర్మాత, దర్శకుడు ఇలా ఎవరికి సమస్య వచ్చినా ముందుంటామని నాగబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ఐదేళ్లే. ఈ అధికారం శాశ్వతం కాదు. ఆ తరువాత ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందేనని స్పష్టం చేసారు. మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.