అక్కినేని నాగచైతన్య `మజిలీ` చిత్రం నుంచి తన పంథా మార్చుకున్నారు. వైఫ్ సమంత తరహాలోనే స్క్రిప్ట్, క్యారెక్టర్ బాగుంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న `లవ్స్టోరీ`తో పాటు `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` మూవీ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో `లవ్స్టోరీ` షూట్ పూర్తయిపోయి వచ్చే నెల 16న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్తో చేస్తున్న `థ్యాంక్యూ` మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే చై ఇదే ఏడాది బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాతో చై బాలీవుడ్ బాట పట్టే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది.
అమీర్ఖాన్ ప్రస్తుతం `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే చై బాలీవుడ్కి పరిచయం కానున్నారట. ముందు ఈ పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు. డేట్స్ సమస్య కారణంగా ఆయన ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రలో నాగచైతన్యని ఫైనల్ చేసినట్టు తెలిసింది. ఇటీవల ఫరాఖాన్ కమర్షియల్ యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లిన చై ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. చైతన్య మే లేదా జూన్లో ఈ మూవీ షూట్లో పాల్గొనే అవకాశం వుందని తెలిసింది.