విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన పక్కా మాస్ ఎంటర్టైనర్ `వెంకీమామ`. బాబీ డైరెక్షన్లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధిస్తూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్లో చిత్ర బృందం థాంక్స్ మీట్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో నాగచైతన్య సినిమా విజయంపై పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించిన రోజు మైండ్ బ్లాంక్ అయిపోయిందని, ఏమౌతుందో సినిమా ఫలితం ఎలా వుంటుందో అని, ప్రేక్షకులు చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ పడ్డానని, అయితే రిలీజ్ తరువాత ప్రేక్షకుల స్పందన చూసి ఊపిరి పీల్చుకున్నానని వెల్లడించారు. ఈ సినిమాతో ఇద్దరు మామలు కలిసి కమర్షియల్ బ్లాక్ బస్టర్ అంటే ఎలా వుంటుందో రుచి చూపించారని, ఇది తాతగారి డ్రీమ్ అని, తాతగారి సక్సెస్ అని ఇంత మంచి విజయాన్ని అందుకున్నందుకు ఆనందంగా వుందని చెప్పుకొచ్చారు.
కొంత మంది దర్శకులు నా కెరీర్కు కొత్త దారిని చూపించారని, అలాంటి దర్శకుల్లో బాబీ ఒకరని, నాకు, రాశీఖన్నాకు, నాకు వెంకీ మామకు, నాకు, పాయల్ రాజ్పుత్కు మధ్య వచ్చే సన్నివేశాల్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని, `వెంకీమామ` తనకొక కొత్త ఇన్నింగ్స్ అని నాగచైతన్య పేర్కొన్నారు. ఈ సినిమా తరువాత నాగచైతన్య వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ములతో చేస్తున్న చిత్రానికి `లవ్స్టోరీ` అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్లో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించనున్న సినిమా త్వరలోనే సెట్స్పైకి రానుంది.