కరోనా ఎఫెక్ట్ కారణంగా సినిమాకు సమ్మర్ సీజన్ మొత్తం ఖల్లాస్ అయిపోయింది. లాక్ డౌన్ కారణంగా సర్వం బంద్ పాటించడంతో సినిమా షూటింగ్లు, థియేటర్లు మూసి వేశారు. దీంతో అంతా ఇంటికే పరిమితమైపోయారు. ఈ నెల 14తో 21 రోజుల లాక్ డౌన్ ముగుస్తుందని అంతా భావించారు. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో మే 3 వరకు లాక్ డౌన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
దీంతో మరో 19 రోజులు లాక్ డౌన్ విధించడంతో సమ్మర్లో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ కొత్త రిలీజ్ డేట్లపై కసరత్తులు చేయడం మొదలైంది. ఈ క్రమంలోనే నాగచైతన్య నటిస్తున్న `లవ్స్టోరీ` మూవీ రిలీజ్ డేట్ కూడా మరుతున్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం `లవ్స్టోరీ`. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని మే 29న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజా లాక్ డౌన్ కారణంగా ఈ ప్లాన్ మారిపోతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టుకు వెళ్లిన ఆశ్చర్యం లేదని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.