మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, మీనా జంటగా నటించిన చిత్రం `దృష్యం`. 2013లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఇదే చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇదే చిత్రానికి సీక్వెల్ గా `దృశ్యం 2`ని తెరకెక్కించారు.
జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో `దృశ్యం`లో నటించిన మోహన్లాల్, మీనాలతో పాటు పలువురు నటీనటులు నటించారు. ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ చిత్ర టీజర్ని చిత్ర బృందం నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
`సార్.. నేను పోలీసుల్ని తక్కువ భావనతో చూడటం లేదు. సమాజంలో వున్న ప్రజలను వాళ్లు సంరక్షిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి మీరు, మీ పోలీస్టేషన్ నాకు రక్షణ ఇవ్వాలి` అంటూ టీజర్లో మోహన్లాల్ చెబుతున్న డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ సీక్వెల్లో మీనా పాత్ర మరింత కీలకంగా వుండేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మలయాళంలో ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారని తెలిసింది.