ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ల హంగామా నడుస్తోంది. ఈ తరహా చిత్రాలు అత్యధికంగా విజయం సాధిస్తుండటం, ప్రేక్షకుల్లో ఈ తరహా చిత్రాలపై ఆసక్తి చూపిస్తుండటంతో తెలుగులో మరో బయోపిక్ తెరపైకి రాబోతోంది. దర్శకుడనే పదానికి వన్నె తెచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు. ఆయన మృతి చెందిన మూడేళ్లు కావస్తోంది. ఆయన జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.
ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ దాసరి మారుతి రూపొందించనున్నారట. నేడు మారుతి పుట్టిన రోజు ఈ సందర్భంగా దాసరి బయోపిక్పై పలు ఆసక్తికర విశేషాల్ని వెల్లడించారు. దాసరి నారాయణ రావు అంటే తనకు ప్రత్యేక అభిమానమని చెప్పిన మారుతి .. దాసరి బయోపిక్కి సంబంధించిన ఆలోచన చేస్తున్నారట. కథ ఎలా వుండాలి? ఆయన పాత్రలో ఎవరు నటించాలి? వంటి విషయాలపై మారుతికి క్లారిటీ వచ్చిందట.
అయితే ఈ బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ త్వరలో ప్రారంభిస్తానని చెప్పిన మారుతి ఇందు కోసం రెండేళ్లు పట్టవచ్చని క్లారిటీ ఇచ్చాడు. `ప్రతి రోజు పండగే` సినిమాతో సూపర్ హిట్ని సొంతం చేసుకున్న మారుతి త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఏ హీరోతో మారుతి తదుపరి చిత్రం వుంటుందన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు.