భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ కొంత విరామం తరువాత మైథలాజికల్ చిత్రం `శాకుంతలం`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహాభారత ఆదిపర్వంలోని దుశ్యంతుడు, శాంకుతల ల ప్రేమ కావ్యాన్ని కథా వస్తువుగా తీసుకుని అందమైన ప్రేమకావ్యంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై అత్యంత భారీగా నిర్మించబోతున్న ఈ మూవీలో శాకుంతలగా స్టార్ హీరోయిన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
జాతీయ అవార్డు గ్రహీత ఆర్ట్ డైరెక్టర్ అశోక్ ఈ చిత్రం కోసం ఇప్పటికే భారీ సెట్టింగులని నిర్మించడం మొదలుపెట్టారు. సెట్లకి సంబంధించిన మినీ స్కెచ్లని సిద్ధం చేసి ఫైనల్ సెట్లని సిద్ధం చేసి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సెట్లని సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో దుశ్యంతుడిగా ఎవరు నటిస్తారనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది.
మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తారంటూ ఇటీవల వార్తలు షికారు చేశాయి. ఈ వార్తలే నిజమంటూ చిత్ర బృందం శనివారం దుశ్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తున్నాడని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. కీలక ప్రధాన పాత్రలు ఫైనల్ కావడంతో మిగతా పాత్రల కోసం గుణశేఖర్ ఎవరిని ఎంపిక చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.