సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు ఎలా ఉండేవాడో అందరికీ తెలుసు. ఎంత రిజర్వ్డ్ గా ఉండేవాడో అందరం చూసాం. తన సినిమా ఫంక్షన్ లకు, విజయోత్సవ వేడుకలకు కూడా హాజరవ్వడానికి మొహమాట పడేవాడు. అయితే శ్రీమంతుడు నుండి మహేష్ లో చాలా మార్పు వచ్చింది. దానికి నమ్రత కారణం కావొచ్చు లేదా మరేదైనా కారణం కావొచ్చు కానీ మహేష్ లో మార్పు అయితే స్పష్టంగా కనిపించింది. తన సినిమాలను ప్రమోట్ చేసుకునే తీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు.
ఇటీవలే మహర్షి సినిమాను ప్రమోట్ చేసుకునే విధానం ఎలా ఉందో అందరం చూసాం. నిజానికి మహర్షి చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ ఏం రాలేదు. బోరింగ్ సినిమా అనే అన్నారు. అయితే మహేష్ మాత్రం ఎక్కడా నిరుత్సాహపడలేదు. తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే వరకూ ఎక్కడా విశ్రమించలేదు. మొత్తానికి మహర్షి చిత్రాన్ని హిట్ అనిపించాడు.
ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రం విషయానికి వచ్చేసరికి మహేష్ మరింత ముదిరిపోయాడు. సినిమా విడుదలకు వారం రోజుల నుండి మొదలుపెట్టిన మహేష్, సినిమా విడుదలై వారం అవుతున్నా ఎక్కడా ఆపలేదు. ఏ రోజు చూసినా ఎక్కడో ఒక చోట సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్ చేసిన మహేష్, ఈరోజు తన కూతురు ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమా విడుదలకు ముందు తర్వాత మీడియాకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడో లెక్కే లేదు. ట్విట్టర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టాడు. అలాగే నిన్న ఫేస్ బుక్ లో గంట పాటు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.
పోటీగా అల వైకుంఠపురములో దున్నేస్తుండడంతో మహేష్ ఎక్కడా విశ్రమించట్లేదు. తన సినిమా ప్రమోషన్స్ కు పనికొచ్చే ఏ మాద్యమాన్నీ వదిలిపెట్టట్లేదు. ఇది చూసిన ఎవరైనా మిగతా హీరోలు మహేష్ ను చూసి ఎంతైనా నేర్చుకోవచ్చు అని సలహాలు కూడా ఇస్తున్నారు అంటే చూసుకోండి మహేష్ ఎంతలా మారిపోయాడో.