ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు కలుస్తారో ఎవరూ చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో కలిసే కాంబినేషన్స్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్కి కూడా షాకిస్తుంటాయి. అలాంటి కాంబినేషనే అల్లు అరవింద్, సూపర్స్టార్ మహేష్. ఇన్నేళ్ల ప్రస్థానంలో బయటి స్టార్ హీరోతో గీతా ఆర్ట్స్లో సినిమా రాలేదు. ఆ రికార్డుని త్వరలోనే బ్రేక్ చేయబోతున్నారు. మహేష్ త్వరలో అల్లు అరవింద్ నిర్మాతగా ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నారు.
దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే బయటికి రాబోతోంది. గత ఏడాది `మహర్షి` చిత్రంతో సూపర్హిట్ ని సొంతం చేసుకున్న సూపర్స్టార్ మహేష్ ఇటీవల సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తరువాత వెకేషన్ కోసం అమెరికా వెళ్లిన మహేష్ తిరిగి వచ్చాక వంశీ పైడిపల్లి చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నారు.
మహేష్ తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారట. `మహర్షి`లో రైతు సమస్యల్ని అంతర్లీనంగా చూపించి ఆకట్టుకున్న వంశీ పైడిపల్లి తాజా చిత్రంలోనూ మంచి సందేశాన్నే ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తరువాతే మహేష్ గీతాఆర్ట్స్ చిత్రానికి డేట్స్ కేటాయిస్తారని, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.