స్టార్ హీరో మహేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్లో స్టార్ డమ్ని సొంతం చేసుకున్న మహేష్ కరోనా వైరస్ ప్రారంభం నుంచి నిత్యం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్కి నెటిజన్స్ అందుబాటులో వుంటున్నారు. ప్రతీ రోజు జరిగే విషయాలని షేర్ చేసుకుంటున్నారు. కరోనా ని ఎదిరిస్తూ ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి డాక్టర్స్కి, పోలీసులకి, సానిటేషన్ కార్మికులకి సంఘీభావం తెలుపుతున్నారు.
దీంతో మహేష్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. తాజాగా మహేష్ ట్విట్టర్లో భారీ ఫీట్ని అధిగమించారు. ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్స్ ఆయన ఖాతాలో చేరడం విశేషంగా చెబుతున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ ఘనత సాధించిన తొలి హీరోగా మహేష్ అరుదైన ఘనతని సాధించారు. తమిళ హీరో ధనుష్ 9.1 మిలియన్ల ఫాలోవర్స్తో తరువాతి స్థానంలో నిలిచారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి.
మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. యంగ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం కోసం భారీ స్థాయిలో బ్యాంక్ సెట్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది.