మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కథ క్లైమాక్స్ కు వచ్చింది. దాదాపు నెల రోజులుగా ప్రధాన పోటీ దారులు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ల మధ్య మాటల యుద్ధం అందరికి తెలిసిందే. 900 మంది ఆర్టిస్టులు కలిసి ఎన్నుకునే ఈ మా ఎలక్షన్స్ సమరం.. ఇదేదో సాధారణ ఎలక్షన్స్ రేంజ్ లో వాదనలు.. మాటా.. మాటా అనుకోవడాలు.. వార్నింగులు.. చర్చలు జరిగాయి. వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేసే రోజు.. డెసిషన్ డే ఈరోజు అవడం విశేషం.
ఒకప్పుడు మా ఎలక్షన్స్ అంతా యునానిమస్ గా జరిగేవి. సినీ పెద్దలంతా చర్చించుకుని ఈసారి ఈయన్ను మా ప్రెసిడెంట్ చేద్దామని అనుకుని అలా కానిచ్చేవారు. కాని గత మూడు, నాలుగు టర్మ్ ల నుండి మా ఎలక్షన్స్.. హంగామా మొదలైంది. ఈసారి అలాంటి గొడవలేమి లేకుండా ఏకగ్రీవం చేద్దామని మొదట్లో ప్రయత్నాలు జరిగాయి కాని అలా జరగలేదు.. ఎన్నికలు అనివార్యం అవడంతో మా ఎలక్షన్స్ నిర్వహించారు.
ఇదిలాఉంటే ఈసారి మా ఎలక్షన్స్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ మంచు హీరో విష్ణు అని చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని ముందు ఎనౌన్స్ చేయగా.. ఈసారి రేసులో నేనున్నా అంటూ మంచు విష్ణు ఎనౌన్స్ మెంట్ చేశాడు. మంచు విష్ణు లాంటి యువ హీరో మా ప్రెసిడెంట్ గా పోటీ చేయడం అంతటా ఆసక్తికలిగేలా చేసింది. ఇక ప్రకాష్ రాజ్ కు తాను ఏమాత్రం తక్కువ కాదు అనేలా మంచు విష్ణు ప్రెస్ మీట్లు చేస్తూ వచ్చాడు. అంతేకాదు తన మేనిఫెస్టో కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు. మంచు విష్ణు వల్లే ఈసారి మా ఎలక్షన్స్ కు ఇంత హంగామా వచ్చిందని చెప్పొచ్చు.
ప్రకాష్ రాజ్ ప్రత్యర్ధులు అతన్ని నాన్ లోకల్ ట్యాగ్ తో టార్గెట్ చేశారు. అయితే దానికి కొందరు సపోర్ట్ చేసినా మరికొందరు మాత్రం దాన్ని తప్పుపట్టారు. ప్రకాష్ రాజ్ కు మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ కొండంత అండగా నిలిచిందని చెప్పొచ్చు.
మా ఎలక్షన్స్ కోసం ప్రకాష్ రాజ్ మంచు విష్ణుని అతని ప్యానల్ ను టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెడితే.. ఆ నెక్స్ట్ డే మళ్లీ మంచు విష్ణు కూడా రిటర్న్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా మా ఎలక్షన్స్ కోసం ఈ ప్రెస్ మీట్ ల రచ్చ షురూ అయిందని చెప్పొచ్చు.
ఈసారి మా ఎలక్షన్స్ కు పొలిటికల్ సెగ కూడా తగిలిందని చెప్పొచ్చు. మేమంతా సినిమా బిడ్డలం అంటూనే ఇండస్ట్రీలో వివిధ రకాల పార్టీ ఫాలోవర్స్ ఉండటం వల్ల ఆ వేడి కూడా తగిలి మా ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారేలా చేశాయి.
ఈరోజు జరిగిన మా ఎలక్షన్స్ ఓటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇదివరకు ఎప్పుడూ మా ఎలక్షన్స్ కు పవన్ వచ్చి ఓటు వేసింది లేదు. కాని ఈసారి మా ఎలక్షన్స్ టైం లో తన మీద కొన్ని కానెట్లు.. కొందరు తనని టార్గెట్ చేయడంతో ఎర్లీ అవర్స్ లోనే పవన్ కళ్యాణ్ వచ్చి మా ఎలక్షన్స్ లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక ఈసారి రాం చరణ్ కూడా మా ఎలక్షన్స్ లో ఓటింగ్ వేశారు. ఓ ప్రెస్ మీట్ లో చరణ్ ఓటు వేసేందుకు వస్తాడా అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడాడు. ఈసారి అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వకూడదని చరణ్ మా ఎలక్షన్స్ ఓటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాదు జెనిలియా మీద ప్రకాష్ రాజ్ పంచ్ కూడా తెలిసిందే. సీ.ఎం కొడుకుని పెళ్లి చేసుక్ని వెళ్లిందని జెనిలియాపై ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేశారు. అందుకే ఈసారి మా ఎలక్షన్స్ లో తన ఓట్ వేసేందుకు జెనిలియా కూడా వచ్చింది. ముంబై నుండి ఆమె ఓటు వేసేందుకు రావడం విశేషం.
ఇక ఫైనల్ గా ఈసారి మా పోటీ స్పెషల్ గా ఉండటం మరో కారణం ఎక్కువమంది ఓటింగ్ వేయడం. అటుఇటుగా 900 మంది ఉండే మా సభ్యుల్లో ఈసారి 600కి పైగా ఓటింగ్ వేయగా పోస్ట్ బ్యాలెట్ ద్వారా మరో 60 మంది మొత్తం 665 మంది ఈసారి మా ఎలక్షన్స్ లో ఓట్ వేసినట్టు తెలుస్తుంది. అంతకుముందు హయ్యెస్ట్ 468 ఓట్లు మాత్రమే పడగా ఈసారి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పొచ్చు.
ఇక సమరం ముగిసింది.. రావాల్సింది ఫలితాలు మాత్రమే.. మరి ప్రకాష్ రాజ్ ను గెలిపిస్తారా.. మంచు విష్ణుని ప్రెసిడెంట్ గా నిలబెడతారా అన్నది ఈరోజు రాత్రి 8 గంటల వరకు తెలిసే అవకాశం ఉంది.