
భారీ వర్షాలతో బెంగళూర్లో జనజీవనం అస్తవ్యస్ధంగా మారింది. రోడ్లు చెరువుల్లా మారండంతో.. ఐటీ ఉద్యోగులు బుల్డోజర్లు, ట్రాక్టర్ల మీద ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్పోర్టు కూడా నీట మునిగింది. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్ అయ్యింది. వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో చాలామంది ఐటీ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు.
అయితే, వరదలకు బెంగళూరు నీటమునగడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశ ప్రగతికి పట్టుకొమ్మలైన పట్టణాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని చెబుతూ వరుస ట్వీట్లు చేశారు. నగరాలే మన దేశాభివృద్ధికి ప్రాధమిక వనరులని.. వాటికి తగిన నిధులివ్వకపోతే మౌలిక సదుపాయాలు దిగజారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సహా దేశంలోని ఏ ఒక్క నగరానికి అప్పటికప్పుడు తలెత్తే పెను వాతావరణ మార్పులను తట్టుకొని నిలబడగలిగే శక్తి లేదని తెలిపారు.
అర్బన్ ప్లానింగ్పై కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఉమ్మడిగా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఫోకస్ పెట్టాలని, అవసరమైన ప్రణాళికలు చేయాలంటూ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరిని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్విట్ చేశారు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలే ఆర్థిక, దేశాభివృద్ధికి కీలకమని.. మౌలిక వసతుల కల్పనతోనే ఇది సాధ్యమన్నారు. పట్టణ ప్రణాళికలో కీలకమైన సంస్కరణలు అవసరం అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఏకధాటిగా రికార్డ్ స్థాయిలో దంచికొట్టిన కుండపోత వానకు సిలికాన్ సిటీ బెంగళూరు కకావికలమైపోయింది. నగరం నదిలా మారడంతో వరదనీటిలో చిక్కుకున్న బస్సులను ప్రయాణికులే బయటకు లాగాల్సిన పరిస్థితేర్పడింది. ఐతే మరో మూడు రోజులు బెంగళూర్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలు అలర్ట్గా ఉండాలని..అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. దీనికితోడు రెండ్రోజుల పాటు మంచినీటి సరఫరా కూడా ఉండదని ప్రకటించారు అధికారులు. ఇక వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.