సుశాంత్ రాజ్ పుత్ జూన్ 14న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త యావత్ దేశాన్ని నివ్వెర పోయేలా చేసింది. హీరోగా విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరో ఉన్నట్టుండి అర్థాంతరంగా మృతి చెందడం ఏంటని అంతా అవాక్కయ్యారు. అతని మరణం వెనక పెద్ద కుట్ర జరిగిందని కంగన లాంటి వాళ్లు, నెటిజన్స్, సుశాంత్ ఫ్యాన్స్ బాలీవుడ్పై దుమ్మెత్తి పోశారు.
బాలీవుడ్ మాఫియా కారణంగానే సుశాంత్ మరణించాడని, అతనిది ఆత్మ హత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని బాలీవుడ్లో ఓ వర్గం నిప్పులు చెరిగింది. అయితే సుశాంత్ ది హత్య కాదని, అతను ఆత్మ హత్య చేసుకున్నాడని ముంబై పోలీసులు వెల్లడించడం, ఆ తరువాత దర్యాప్తు జరుపుతున్న తీరుపై స్వయంగా బీజేపీ నేతలతో పాటు ఆర్జేడీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేయడం, ముంబై పోలీసులపై విశ్వసనీయత లేదని స్వయంగా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య వెల్లడించడం సంచలనంగా మారింది.
సుశాంత్ స్వరాష్ట్రమైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించాలంటూ కేంద్రాన్ని కోరడం అందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. బుధవారం తెలుగు హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఈ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ మరణం వెనక ఏనిజముందే అందరికి తెలియాలి. అందుకు సీబీఐ విచారణ చేపట్టాలి` అని లావణ్య త్రిపాఠి సంచలన ట్వీట్ చేసింది.