మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన వేళ లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి జనజీవితం పూర్తి గా స్థంభించిపోయింది. లాక్డౌన్ నిబంధనలు సడలించేంత వరకు జనం గడపదాటి బయటికి రాలేదు. ఆ సమయంలో కరోనా వైరస్పై అవగాహన కలిగిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీలు వరుస వీడియోలని, పాటల్ని ప్రజల్లోకి వదిలిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా వుండాలో స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా పలు సూచనలు, సలహాలు ఇస్తూ జనాన్ని జాగృతం చేస్తున్నారు. ఎంతగా చెబుతున్నా కొంత మందిలో మాత్రం మార్పు రావడం లేదు. మాస్కులు ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి అంటూ చాలా మంది సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నా అక్కడక్కడ కొంత మంది పట్టించుకోవడం లేదు. దీంతో వైరస్ విజృంభిస్తోంది.
పరిస్థితులు చేయిదాటుతున్నాయని ఆగ్రహించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మాస్కులు వేసుకోకుండా తిరుగుతున్న వారిపై అసహనం వ్యక్తం చేశారు. `ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం (ముక్కు , మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). మాస్కులు వేసుకోని వాళ్లకు మాస్కులు వేసుకోమని చెబుదాం` అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.