కరోనా వైరస్ రోజు రోజుకీ తెలుగు రాష్ట్రాల్లో ప్రమాద కరంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకీ కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. కానీ వేలల్లో కేసులు పెరుగుతుంటే వందల్లో మాత్రమే బయటిక వస్తున్నాయి. దీనికి కారణం ప్రజల్లో సరైనవగాహనతో పాటు కరోనా బారిన పడిన చాలా మంది బయటికి చెప్పకుండా దాయడమేనని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రతి పక్షాలు ప్రభుత్వమే కావాలనే కరోనా కేసుల్ని దాస్తోందని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వారు స్వచ్ఛందంగా బయటపెట్టకపోవడంతో వారి కారణంగా సిటీ అంతా వ్యాపిస్తోంది. ఈ విషయంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సీరియస్గా రియాక్ట్ అయ్యారు, సోషల్మీడియా వేదికగా కొరటాల పలు సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైరస్ సోకిన వ్యక్తులు ఆ విషయాన్ని రహస్యంగా వుంచడం వైరస్ కంటే ప్రమాదకరం అని కొరటాల సూచించారు. మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం. దయచేసి కరోనా సోకిన ప్రతీ ఒక్కరు ఆ విషయాన్ని రహస్యంగా వుంచొద్దు. వెంటనే వెల్లడించండి` అన్నారు.
మీకు వైరస్ సోకిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, మీ సన్నిహితులకు వెంటనే తెలియజేయండి. దాని వల్ల మీతో పాటు వారు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకుని త్వరగా కోలుకునే అవకాశం వుంటుంది. ఇది నా అభ్యర్థన అని కొరటాల వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.