మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలోని కీలక అతిథి పాత్రలో రామ్చరణ్ నటించనున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా పూర్తయిన తరువాత మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్`రీమేక్ని పట్టాలెక్కించాలనుకున్నారు.
మలయాళంలో మోహన్లాల్, పృథ్వీరాజ్ హీరోలుగా కలిసి నటించిన చిత్రం `లూసీఫర్`. అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో చిరుతో రామ్చరణ్ రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. `సాహో` ఫేమ్ సుజీత్ ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి బాధ్యతల్ని ఇప్పటికే సుజీత్కి అప్పగించారు. తెలుగు నేటివిటీకి మార్పులు చేర్పులు పూర్తయ్యియి.
ఇందులోని కీలక సిస్టర్ క్యారెక్టర్ కోసం వెటరన్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రంలోని సిస్టర్ క్యారెక్టర్లో సుహాసిని నటిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా ఆ స్థానంలో ఖుష్బూ పేరు వినిపిస్తోంది. గతంలో చిరు, ఖుష్బూ కలిసి అక్కా తమ్ముళ్లుగా `స్టాలిన్` చిత్రంలో నటించారు. మళ్లీ `లూసీఫర్` రీమేక్ కోసం అదే కాంబినేషన్ రిపీట్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఖుష్బూ కూడా చిరుతో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.