కీర్తిసురేష్.. ఆమెకు నటనరాదు. అసలు హావభావాలే పలికించరాదు. బొద్దుగా వుంటుంది. అలాంటి ఆమె మహానటి ఏంటి? మీకేమైనా పిచ్చా? ఆమెని పెట్టుకుని పరువుతీసుకుంటారా?.. `మహానటి` చిత్రానికి ముందు కీర్తి సురేష్ గురించి వినిపించిన విమర్శలివి. తనపై వచ్చిన విమర్శల్ని చిరునవ్వుతో స్వీకరించి అదే చిరునవ్వుతో తిప్పికొట్టింది. `మహానటి` చిత్రంలో సావిత్రే మళ్లీ ఆమె రూపంలో వచ్చి తన పాత్రలో నటించిందా అన్నంతగా కీర్తిసురేష్ మెస్మరైజ్ చేసి ప్రేక్షకులనే కాదు విమర్శకుల చేత కూడా శభాష్ అనిపించుకుంది.
ఈ సినిమా తరువాత నటనకు ఆస్కారమున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తున్న కీర్తిసురేష్ తాజాగా తలైవర్ తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని అంగీకరించింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. సోమవారం సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని ప్రకటించింది. `నా సినీ ప్రయాణంలో ఇదొక మ్యాజికల్ మైల్స్టోన్. సూపర్స్టార్ రజనీ సర్తో కలిసి నటించడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోనుంది. ఈ అవకాశాన్నిచ్చిన దర్శకుడు శివకు, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్కు నా కృతజ్ఞతలు` అని తెలిపింది.
కీర్తి సురేష్ ప్రస్తుతం ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం `మరక్కార్`, బాలీవుడ్లో అజయ్ దేవగన్ హీరోగా రూపొందిస్తున్న బయోపిక్ `మైదాన్`, మిస్ ఇండియా, పెండ్విన్, గుడ్ లక్ శక్తి, నితిన్ హీరోగా రూపొందుతున్న `రంగ్ దే` చిత్రాల్లో నటిస్తోంది.