కొన్ని సార్లు సందర్భాన్ని బట్టి చేసే జోక్లు అప్పుడప్పుడు నిజమవుతుంటాయి. ఓయంగ్ హీరో తన సినిమా ఫంక్షన్కి వచ్చిన ఓ బిగ్ ప్రొడ్యూసర్తో చేసిన జోక్ నెలలు తిరక్కుండానే నిజమై అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ జోక్ చేసిన హీరో మరెవరో కాదండోయ్ `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ. వాస్తవంగా జరిగిన కథ ఆధారంగా రూపొందిన చిత్రం `ఆర్ ఎక్స్ 100`. గత ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమాతో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ పాపులర్ అయ్యారు. అయితే ఈ సినిమా తరువాత `హిప్పీ` పరాజయం కావడంతో కార్తికేయ ఈ సారి ఎలాగైనా హిట్ని సొంతంచేసుకోవాలని చేసిన చిత్రం `గుణ 369`. బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వచ్చారు. ట్రైలర్ రిలీజ్చేసిన సందర్భంగా గీతా ఆర్ట్స్లో నటించే ఆవకాశం ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నానని హీరో కార్తికేయ వేదిక సాక్షిగా అల్లు అరవింద్ని అడిగేశారు.
వెంటనే చేద్దాంలే అన్నారు. లేదు సర్ జోక్ చేశానని కార్తికేయ అనడంతో వేదిక మీదున్న వాళ్లంతా ఘొల్లున నవ్వారు. ఆ రోజు కార్తికేయ గీతా ఆర్ట్స్లో అవకాశం ఇవ్వండని చేసిన జోక్ ఈ రోజు నిజమైంది. గీతా ఆర్ట్స్కు అనుబంధ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో కార్తికేయ ఓ సినిమా చేయబోతున్నారు. బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు `చావు కబురు చల్లగా` అనే టైటిల్ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.