బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ముంబై హైకోర్టుని ఆశ్రయించింది. కంగన, ఆమె సోదరి రంగోలీ సోమ, మంగళ వారాల్లో తమ ముందు హాజరు కావాలంటూ ముంబై పోలీసులు ముచ్చటగా మూడవసారి సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కంగన తమపై ముంబై పోలీసులు దాఖలు చేసిన సమన్లతో పాటు ఎఫ్ ఐ ఆర్ ని వెంటనే రద్దు చేయాలని ముంబై హైకోర్టుని ఆశ్రయించింది.
కంగన, ఆమె సోదరి రంగోలీ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలకు రెచ్చగొడుతున్నారని ఫిట్నెస్ ట్రైనర్ మున్వర్ అలీసయ్యద్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికి రెండు సార్లు సమన్లు జారీ చేశారు. అయినా కంగన, రంగోలీ హాజరు కాలేదు. తమ సోదరుడి వివాహ వేడుకలో పాల్గొంటున్నామని, ప్రస్తుతం హాజరు కాలేమని తమ లాయర్ ద్వారా సమాచారం అందించారు.
తాజాగా మూడవసారి ముంబై పోలీసులు సమన్లు జారీ చేయగా కంగన, రంగోలీ ముంబై హైకోర్టుని ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసుని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి తరువాత కంగన రనౌత్, రంగోలీ బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ముంబై పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు మతసామరస్యానికి విఘాతం కలిగించేలా వున్నాయని ఫిట్నెస్ ట్రైనర్ మున్వర్ అలీసయ్యద్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాంద్రా మెట్రో పాలిటన్ కోర్టు ముంబై పోలీసుల్ని విచారణకు ఆదేశించారు.