బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గత కొంత కాంలగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి నుంచి నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్నారామె. ఒకానొక దశలో మహారాష్ట్ర సీఎంనే టార్గెట్ చేసి ఆయనతో కయ్యానికి కాలుదువ్వి సంచలనం సృష్టించింది.
తన ట్వీట్ల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్న కంగన తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. శనివారం కంగన రనౌత్ ట్విట్టర్ వేదికగా ఆశ్చర్యకరమైన ప్రకటన చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కంగన నటిగా కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని పొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించింది. మణికర్ణిక ఫిల్మ్స్ పేరుతో సొంత బ్యానర్ ని ప్రారంభిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
అంతే కాకుండా బ్యానర్ టైటిల్ లోగోని కూడా అభిమానులతో పంచుకుంది. ఈ బ్యానర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ని కూడా ప్రకటించింది. అయితే కంగనా ప్రధాన స్రవంతి సినిమాకు బదులుగా డిజిటల్ రంగంపై దృష్టి సారించనుంది. ఇందు కోసం మొదటి ప్రాజెక్ట్గా ‘టికు వెడ్స్ షెరు’ అనే అందమైన ప్రేమకథని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్త నటీనటులు నటించనున్నారు.
`‘టికు వెడ్స్ షెరు’ అనే అందమైన ప్రేమకథతో డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇదే సమయంలో మణికర్ణిక ఫిల్మ్స్ లోగోను విడుదల చేయడం ఆనందంగా వుంది. మీ ఆశీస్సులు కావాలి`అని కంగనా ట్వీట్ చేశారు. ఇది కంగన నిర్మాతగా కొత్త ప్రయాణం. నటిగా ఆమె విజయం సాధించినట్లుగా నిర్మాతగా కూడా తన మ్యాజిక్ని పునరావృతం చేస్తుందో చూడాలి.
Launching the logo of @ManikarnikaFP with the announcement of our debut in digital space with a quirky love story Tiku weds Sheru …. Need your blessings ???? pic.twitter.com/ulaMK62m7l
— Kangana Ranaut (@KanganaTeam) May 1, 2021