మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎమోషన్స్కి యాక్షన్ అంశాల్ని జోడించి తెరపైకి తీసుకొస్తున్న చిత్రం `అల వైకుంఠపురములో`. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పక్కా మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాజ్, బంటు పేర్లతో ఆయన క్యారెక్టర్ ని దర్శకుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది. ఇందులో హీరోయిన్లుగా పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. కీలక పాత్రలో టబు కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ అందించిన స్వరాలు పాపులర్ అయ్యాయి.
దీంతో ఆడియో పరంగా ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి రేసులో ముందు వరుసలో నిలిచింది. మరింత క్రేజ్ని సొంతం చేసుకోవాలంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలని భావించిన దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ పాట కోసం భారీ బడ్జెట్నే కేటాయించిన దర్శకుడు క్రేజీ చందమామ కాజల్ అగర్వాల్ ని సంప్రదించినట్లు వినిపిస్తోంది. ఆమె ఈ పాటలో నటిస్తే సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందని, ఇందుకు ఆమెకు భారీ ఆఫర్నే ఇచ్చారట. త్రివిక్రమ్ ఇచ్చిన ఆఫర్ టెమ్టింగ్ గా వుండటంతో కాజల్ ఓకే చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఓ భారీ సెట్లో కాజల్, అల్లు అర్జున్లపై ఈ స్పెషల్ సాంగ్ని షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. `జనతా గ్యారేజ్` చిత్రంలో తొలిసారి `నేను పక్కా లోకల్..` అంటూ కాజల్ అగర్వాల్ మాస్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. అల వైకుంఠపురము`లో ఏ పాటకే కాజల్ మెరుపులు మెరిపిస్తుందో చూడాలి. పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.