తెలుగు, తమిళ చిత్రాల్లో సంగీతం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఇళయరాజా. 80, 90ల్లో ఆయన సంగీతం అందించని సినిమా లేదంటే అది అతిశయోక్తి కాదేమో. అంతగా ఆయన దక్షిణాది సినీ ప్రపంచాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించారు. అలాంటి ఇళయరాజా గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన పాటల్ని రైట్స్ తీసుకోకుండా స్టేజీలపై పాడుతూ డబ్బులు సంపాదిస్తున్నారని, రాయల్టీ కూడా ఇవ్వడం లేదని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ఇళయారాజా. ఆ తరువాత నుంచీ తన పాటల రైట్స్ విషయంలో నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా ఎల్వీ ప్రసాద్ మనవడు, ప్రసాద్ స్టూడియోస్ డైరెక్టర్ సాయి ప్రసాద్ పై కేసు వేసి మరోసారి ఇళయరాజా వార్తల్లో కెక్కారు. గత 40 ఏళ్ల క్రితం ప్రసాద్ స్టూడియోస్ లో ఇళయరాజాకు ఓ స్టూడియోని కేటాయించారు. అప్పటి నుంచి ఆయన అందులోనే సినిమాలకు ట్యూన్లు కడుతూ వచ్చారు. తాజాగా ఆ స్టూడియోని ఖాలీ చేయాలని, ఇన్నేళ్లు వాడుకుంది చాలని ఎల్వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.
అయితే దీనిపై ఇళయరాజా కోర్టుని ఆశ్రయించారు. తనకు ఎల్వీ ప్రసాద్ ప్రేమతో కేటాయించిన స్టూడియోను ఖాలీ చేయనని ఇళయరాజా వాదిస్తున్నారు. ఈ వివాదం చెన్నై కోర్టులో నడుస్తోంది. ఇదిలా వుంటే తాజాగా ఇళయరాజాను బలవంతంగా స్టూడియో నుంచి ఖాలీ చేయించే పనులని ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన ఇళయరాజా చెన్నై పోలీస్ కమీషనర్ని ఆశ్రయించి సాయి ప్రసాద్పై కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనకు చెందిన స్టూడియోలో వున్న పరికరాల్ని సిబ్బంది ధ్వంసం చేశారని, స్టూడియో నుంచి తనని దౌర్జన్యంగా ఖాలీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని కేసు పెట్టడం సంచలనంగా మారింది.