`మౌనమేలనోయి` చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సచిన్ జోషిది గుట్కా సామ్రాజ్యం. దాని వల్లే ఎన్నో ఆస్తులు కూడబెట్టారు. అదే అతన్ని ఇప్పుడు కటకటాల వెనక్కి నెట్టేలా చేసింది. గుట్కా అక్రమ రవాణా నేపథ్యంలో హీరో సచిన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కా స్మగ్లింగ్ నేపథ్యంలో కొంత మందిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 80 బాక్స్లని స్వాధీనం చేసుకున్నారు.
ఆ తరువాత వారిని విచారిస్తే సచిన్ పేరు బయటికి రావడంతో ఆయనకు సమన్లు జారీ చేశారు. అయితే సచిన్ నుంచి వాటికి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అరెస్ట్కు రంగం సిద్ధం చేశారు. తాజాగా దుబాయ్ నుంచి ముంబై వచ్చిన సచిన్ని ఏయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం హైదరాబాద్ తీసుకురానున్నారని తెలిసింది.
అతనిపై 336, 237 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్న సచిన్ దుబాయ్లో వుంటున్నారు. పలు చిత్రాల్లో నటించడమే కాకుండా ఆయన `నీ జతగా నేనుండాలి`, `ఒరేయ్ పండుగా` వంటి చిత్రాల్లో నటించారు. `నీ జతగా నేనుండాలి` చిత్రానికి గానూ సచిన్ జోషికి బండ్ల గణేష్కి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.