కొత్త తరహా సినిమాలకు ప్రేక్షకులు ఈ మధ్య బ్రహ్మరథంపడుతున్నారు. కొత్త కథలు, విభిన్నమైన స్క్రిప్ట్లకు ఆదరణ పెరుగుతుండటంతో మేకర్స్ కూడా ఆ తరహా కథల్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కొత్త తరహా చిత్రాలకే ప్రాధాన్యత నిస్తున్నారు. ఈ కోవలో మరో కొత్త తరహా సినిమా రాబోతోంది. అదే `విందు భోజనం`. నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్థన్ ఈ చిత్రంలో కీ రోల్ పోషించబోతున్నారు.
ఇటీవల త్రివిక్రమ్ రూపొందించిన `అల వైకుంఠపురములో` చిత్రంలో సునీల్కు ఫాదర్గా నటించి తనదైన నటనతో ఆకట్టుకున్న హర్షవర్థన్ తాజాగా మరో విభిన్నమైన సినిమాని అంగీకరించారని తెలిసింది. ఈ చిత్రానికి ఇప్పటికే `విందు భోజనం` అనే టైటిల్ని ఖరారు చేశారు. అంతా కొత్త వారితో ఈ చిత్రం తెరకెక్కనుంది. హైదరాబాదీ ఫ్యామిలీ డ్రామాగా తెరపైకి రాబోతున్న ఈచిత్రం ప్రధానంగా ఓ రెస్టారెంట్ నేపథ్యంలో సాగుతుందట.
హర్షవర్థన్తో పాటు సునీత చౌదరి కూడా ప్రధాన పాత్రల పోషించనుంది. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సొంటి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని విశేషాల్ని త్వరలోనే చిత్ర బృందం వెల్లడించనుంది. గతంలో హర్థవర్థన్ `గడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం అర్థాంతరంగా ఆగిపోయింది.