అమెరికన్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నెట్ఫ్లిక్స్, అమెజార్ ప్రైమ్, ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన జీ5, ఆల్ట్ బాలాజీ వంటి ఓటీటీలు దక్షిణాది మార్కెట్ని ఆక్రమించేస్తున్నాయి. అలా జరక్కూడదని భావించిన ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా `ఆహా` పేరుతో ఓ డిజిట్ ప్లాట్ ఫామ్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
దీని ద్వారా లోకల్ కంటెంట్ని ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులకు అందించాలని ప్లాన్ చేశారు. వంద శాతం తెలుగు వెబ్ సిరీస్లతో పాటు తెలుగు సినిమాల్ని ఈ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న `ఆహా` ఓటీటీ ప్రివ్యూని ఫిబ్రవరి 8న ఏర్పాటు చేసి `ఆహా`ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
ఇటీవల ప్రారంభంమైన ఈ ఓటీటీకి కేవలం రెండు వారాల్లోనే అనూహ్య ఆదరణ లభించింది. ఐదు లక్షల రిజిస్ట్రేషన్లు నమోదు కావడం విశేషంగా చెబుతున్నారు. ఇప్పటికే 671000 రిజిస్ట్రేషన్స్ దాటినట్టు తెలుస్తోంది. `ఆహా`లో `కొత్త పోరడు, మస్తీస్, షిట్ హెపెన్స్, గీతా సుబ్రమణ్యం, వంటి వెబ్ సిరీస్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ యాప్ని ఈ నెల 25న ఉగాది సందర్భంగా భారీ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. ఈ ఈ వెంట్లో ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలంతా పాల్గొంటారని తెలిసింది.