తెలుగు తెరపై నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, రచయితగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చిరంజీవి నటించిన `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన ఇప్పటి వరకు దాదాపు 290 చిత్రాల్లో నటించిన ఆయన స్వస్థలం విజయనగరం. ఏప్రిల్ 14న ఆయన మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లి అన్నపూర్ణమ్మ, తండ్రి సుబ్బారావులకు గొల్లపూడి ఐదవ సంతానం. నాటకాలు, కథలు, నవలలు రాసిన ఆయన పలు దిన పత్రికలల్లో వ్యాసాలు కూడా రాసి ఆకట్టుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (ఆనర్స్) పూర్తి చేసి ఆంధ్ర ప్రభ ఉపసంచాలకులుగా తొలి ఉద్యోగాన్ని చేశారాయన.
రచయితగా మంచి పేరు తెచ్చుకున్న గొల్లపూడి `డాక్టర్ చక్రవర్తి` చిత్రానికి గానూ ఉత్తమ రచయితగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. సినిమాల్లోకి రాక ముందు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోనూ, కడప కేంద్రం ఉపసంచాలకుడిగానూ సేవలందించారు. ఆయన రచనలు ఇప్పటికీ పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వున్నాయి. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, ఆలయ శిఖరం, అభిలాష, శివుడు శివుడు శివుడు, స్వాతిముత్యం, యముడికి మొగుడు, అసెంబ్లీరౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369, శివ వంటి తదితర చిత్రాల్లో నటించారు. ఆత్మగౌరవం, కళ్లు చిత్రాలకు గానూ కథా రచయితగా నంది పురస్కారాలు అందుకున్నారు. `మాస్టారి కాపురం` సినిమాకు ఉత్తమ సంభాషణల రచయితగా మరో నంది ఆయన్ని వరించింది.
ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచితమైన గొల్లపూడి మారుతీరావు తెర వెనుక మాత్రం సుప్రసిద్ధ రచయిత.
ఆంధ్రప్రభ ఉప సంచాలకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన అటుపై సినిమాల్లో తనదైన శైలి రచనలతో ఆకట్టుకున్నారు. వ్యాఖ్యాతగా బుల్లితెరపై తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి గొప్ప వ్యక్తి ఆకస్మిక మృతి పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.