ప్రపంచాన్ని కరోనా వైరస్ అల్లాడిస్తోంది. దీని కారణంగా మానవాళి ఘోరకలిని చూస్తోంది. ఎన్నడూ లేని నిశ్శబ్దం. ఊళ్లన్నీ..వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం రద్దీగా వుంటే పట్టనాలన్నీ భయంకరమైన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీదీ బంద్ చేయాల్సిన పరిస్థితి. లాక్ డౌన్ కారణంగా అన్నీ బంద్ చేయాల్సి వచ్చింది. దీంతో సినిమా షూటింగ్లు కూడా ఆపేశారు.
అయినా సరే ఎక్కడా తగ్గేది లేదని, అనుకున్న సమయానికే తమ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాత డీవీవీ దానయ్య చెబుతున్నారు. ఆయన నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర బందం ఈ డేట్ని ప్రకటించేసింది.
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీని కారణంగా `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది దానయ్య చెవికి చేరడంతో ఆయన `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్పై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని, సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న డేట్నే రిలీజ్ చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోనక్కర్లేదని వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.