మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ నటించిన చిత్రం `దృశ్యం`. సంచలన విజయాన్ని సాధించడంతో ఈ చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషల్లో రీమేక్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అజయ్తో పాటు ఈ చిత్రంలో శ్రియ, టబు, ఇషిత దత్తా కీలక పాత్రల్లో నటించారు. హిందీ లో రీమేక్ చేసిన ఈ చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు.
విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నిషికాంత్ కామత్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి క్రిటికల్గా వుందని తెలిసింది. లివర్ సంబంధిత సమస్యతో నిషికాంత్ బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా వుందని వెల్లడించారట.
నిషికాంత్ కామత్ కు దర్శకుడిగా మంచి పేరుంది. మరాఠీ చిత్రంతో 2005లో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు. రాకీ హ్యాండ్సమ్, ఫోర్స్, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హర్షవర్ధన్ కపూర్ హీరోగా `దర్బదార్` పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.