సినీ నటులు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుకు విజయవాడ దుర్గమ్మ గుడిలో ఘోర అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణంరాజు విజయవాడ దుర్గమ్మ గుడిలో కుంకుమార్చన చేయ తలపడ్డారు. దీనికోసం ముందుగానే ఆలయ అధికారులకు సమాచారం అందించినా, కృష్ణంరాజు గుడికి వెళ్లే సమయానికి ఆలయ అధికారులు ఎవరూ ఆయన్ను పట్టించుకోలేదు.
దీంతో వయసు పైబడ్డ కృష్ణంరాజు తీవ్ర ఇబ్బందితో ఆయాసపడుతూ ఆరు అంతస్తులు ఎక్కి సాధారణ భక్తుల్లాగే దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. మాజీ కేంద్రమంత్రి అయిన కృష్ణంరాజుకు ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక దర్శనం ఉండాలి. అలా కాకుండా రాజకీయ కోణంలో ఆయన బిజెపికి చెందిన నేత కావడంతో కావాలనే ఆయన్ను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
కనీసం మానవీయ కోణంలో చూసి మెట్లు ఎక్కలేక ఆయాసపడుతూ మధ్యమధ్యలో ఆగుతూ కొండ ఎక్కిన కృష్ణంరాజుకు తగిన ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని క్యూ లైన్లో నిల్చున్న భక్తులు కూడా అభిప్రాయపడ్డారు. వారు కూడా జాలి చూపించి కొంతమంది దారి ఇవ్వడం జరిగింది. వైసీపీకి చెందిన సాధారణ లోకల్ నేత గుడికి వచ్చినా ప్రత్యేక అనుమతులతో దర్శనం కల్పించే ఆలయ అధికారులు కృష్ణంరాజు విషయంలో వ్యవహరించిన తీరు వివాదాలకు కేంద్రబిందువవుతోంది. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.