లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్లని మళ్లీ ప్రారంభించాలని, థియేటర్స్ని కూడా రీఓపెన్ చేయాలని చిరంజీవి అధ్యక్షతన రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో ఇండస్ట్రీ పెద్దలు గత కొన్ని రోజులుగా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇటీవల హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనికి ప్రతిగా మెగాబ్రదర్ నాగబాబు కూడా స్పందించారు.
బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని మండిపడిన విషయం తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీలో గత కొన్ని రోజులగా చర్చనడుస్తోంది. దీనిపై దర్శకుడు తేజ తనదైన స్టైల్లో స్పందించారు. `ఎన్టీఆర్, ఎస్వీరంగారావు గార్లు షూటింగ్లకు వస్తున్నప్పటి నుంచి చూస్తున్నా.. ఎవరున్నా లేకుండా ఇండస్ట్రీని ఎవ్వడూ ఏమీ చేయలేడు. ఇండస్ట్రీ పర్మనెంట్. మధ్యలో కొంత మంది వచ్చి నా వల్లే ఇండస్ట్రీ నడుస్తోంది.. నేను లేకపోతే ఇండస్ట్రీ లేదు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇండస్ట్రీ మాత్రం శాశ్వతం.
మధ్య మధ్యలో నాలాంటి వాళ్లు, చిన్నవాళ్లు , పెద్దవాళ్లు వస్తుంటారు పోతుంటారు. ఇండస్ట్రీ మాత్రం ముందుకు వెళుతూనే వుంటుంది. రామారావుగారు పోయినా ఇండస్ట్రీ నడిచింది. ఎస్వీ రంగారావు, సావిత్రిగారు పోయినా ఇండస్ట్రీ నడిచింది. అంతకంటే గొప్ప నటులు కానీ, దర్శకులు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. ఇండస్ట్రీ గురించి మీటింగ్ పెట్టి నప్పుడు అందరినీ పిలవాల్సిందే` అన్నారు తేజ. త్వరలో రెండు సినిమాల్ని ఆయన తెరకెక్కించబోతున్నారు.