డిజిటల్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటిటి ప్లాట్ ఫామ్స్ రచ్చ మొదలయ్యాక థియేటర్ కు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అందరూ ఈ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు. ఇదివరకు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆలోచించేవారు, ఆరాలు తీసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఏ సినిమా ఎప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందోనన్న ఆరాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఓటిటి ప్లాట్ ఫామ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటికి సబ్ స్క్రిప్షన్స్ తీసుకుంటూ, షేర్ చేసుకుంటూ సినిమాలను చూస్తున్నారు నేటి కాలం ప్రేక్షకులు. ప్రస్తుతం రిలీజ్ అయిన, అవ్వబోతున్న సినిమాలు ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ముందుగా సంక్రాంతికి విడుదలయ్యే భారీ సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సంగతికి వస్తే.. ఈ డీల్స్ ఇప్పటికే పూర్తయిపోయాయి. సరిలేరు నీకెవ్వరుని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. విడుదలైన 50 రోజులకు ఈ సినిమా ప్రైమ్ లో దర్శనమివ్వనుంది. ఇక అల వైకుంఠపురములో సినిమా విషయానికి వస్తే అప్పట్లో దీని యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాను మీరు ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లలో విడుదలవ్వదు అని ప్రకటించి సంచలనం సృష్టించాడు. థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోవడంతో ఈ రకమైన ప్రకటన చేసారు. అయినా కానీ రీసెంట్ గా ఈ చిత్ర డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. సన్ నెక్స్ట్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ ధరను చెల్లించి సొంతం చేసుకుంది.
సన్ నెక్స్ట్ ఇప్పుడు బాగా అగ్రసివ్ గా సినిమాలను కొంటోంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ రూలర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి వి, నితిన్ భీష్మ సినిమాలను సొంతం చేసుకుంది. ఇక రవితేజ డిస్కో రాజాను కూడా సన్ నెక్స్ట్ కొన్నట్లు తెలుస్తోంది. ఇక మరో లీడింగ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ కూడా రీసెంట్ గా రిలీజైన తెనాలి రామకృష్ణ బిఎ. బిఎల్, మీకు మాత్రమే చెప్తా సినిమాలతో పాటు క్రిస్మస్ రిలీజ్ సందర్భంగా విడుదలవుతున్న ప్రతిరోజూ పండగే చిత్ర హక్కుల్ని కూడా సొంతం చేసుకుంది. వీటిలో కొన్నిటికి విడుదలైన నెల రోజులకే డిజిటల్ రిలీజ్ అయ్యేలా డీల్స్ ఉంటే మరికొన్నింటికి విడుదలైన 50 రోజులకు విడుదలయ్యేలా డీల్ కుదిరింది. అయితే ఏ సినిమాకు ఎలా అనేది త్వరలోనే తెలుస్తుంది.